బాళాసాహబ్ దేవరస్ |
: స్వాభావిక సామర్థాన్ని మేల్కొల్పటమే మన లక్ష్యం :
సూర్యుడు, చంద్రుడూ ఉన్నంతవరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని నిలిపి ఉంచుకోవాలని మన కల్పన కాదు, సంఘానికి రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు మనం జరపబోవటం లేదని డాక్టర్టీ అంటూ ఉండేవారు. యాచిదేహీ యాచిడోలా ఈ తనువుతో ఈ కనులతో-సమాజంలోని స్వాభావిక సామర్థ్యాన్ని ఉత్పన్నంగావించి చూడాలని తహతహలాడేవారు. సంఘం ఈ రూపంతోనే, ఎప్పటికీ, అన్ని పనులూ చేస్తూ ఉండదు. సంఘం దేనిని కోరుతుందో, అది ఈ సమాజంలోని జనసామాన్యంద్వారా తమంతతాముగా చేయబడాలి.
'మన అంతిమ లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుంది?' అంటూ అనేకమంది ప్రశ్నిస్తుంటారు. ఏది సాధిస్తే లేదా ఏ వస్తువు మనకు అందుబాటులోకి వస్తే, సంఘ ఉద్దేశ్యం పూర్తయినట్లుగా
భావించుకోవచ్చు? దానిని సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పనిచేయవలసి ఉంటుంది?
వంటి ప్రశ్నలూ అడుగుతుంటారు
ఇటువంటి ప్రశ్నలలోనుండి ఒక విషయం మనం గ్రహించుకోవచ్చు. ఈ ప్రశ్న అడుగుతున్న స్వయంసేవకులు పనిచేస్తూ చేస్తూ అలిసిపోయారని అనుకోవచ్చు. అయితే ఈ ప్రశ్న వెనుక మరొక అర్థమూ ఉండి ఉంటుంది?. సంఘాన్ని అర్థం చేసుకొనడానికే వారా ప్రశ్న అడుగుతూ ఉండవచ్చు. సంఘకార్మయానికి ఒక నిర్ణయింపబడిన కార్యక్రమపట్టిక ( Time - Table) లేదు. వ్యక్తులుగా ఆలోచిస్తే - మనం బ్రతికి ఉన్నంతవరకూ ఈ పని చేస్తూనే ఉండాలి. సంఘముయొక్క అంతిమలక్ష్యం ఈ సమాజంలో స్వాభావిక సామర్ధ్యాన్ని మేల్కొలపడం. ఇది జరగకుండా సమాజంలో పాతుకొని ఉన్న సంకటము లేవీ పరిష్కరించబడవు.
ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సమాజాలు ఎక్కువగా జాగృతమై, వికసితమై తమ స్వాభావిక స్థితిలో ఉన్నవో, అక్కడక్కడ కొద్దిపాటి ప్రయత్నంతో, తక్కువ సమయంలోనే అవి ఉన్నతి సాధించగల్గినవి. కాగా, మన హిందూ సమాజస్థితి భిన్నంగా ఉంది. వందల సంవత్సరాల విదేశీదాస్యం కారణాన మన సమాజంలో స్వాభావికస్థితి హరించుకుపోయింది. వికటమూ, విశ్ృంఖలమూ అయిన స్థితిలో ఉంది. (సమాజంలోని వ్యక్తులమధ్య బృందాలమధ్య సంబంధాలు ఉండవలసిన తీరులో లేవు). దీనిని మరమ్మతు చేసి సరైన స్థితికి తీసికొని రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుతుందో చెప్పటం కష్టం.
డాక్టర్జీలో 'ఈ తనువుతో, ఈ కనులతో' ఈ సాఫల్యాన్ని చూడాలనే ప్రబలమైన కోరిక ఉండినది. అయితే అది నెరవేరలేదు. మన సమాజం బాగా దిగజారిపోయిన స్థితిలో ఉంది. కాబట్టి దీనిని బాగుచేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దేశంలో అనేకరకాల సమస్యలున్నవి ప్రాంతాలమధ్య భేదాలు, భాషాభేదాలు, బ్రాహ్మణ-అబ్రాహ్మణ భేదాలు వగైరాలు. ఒక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా- మధ్యలో మరో సమస్య తల ఎత్తుతుంది.
ఔరంగజేబ్ మరణించిన తర్వాత అతని కుమారుడు సంభాజీకుమారుడైన శాహూని విడిచిపెట్టాడు. అప్పుడు శివాజీ, సంభాజీల వారసత్వానికి సంభాజీ సవతిసోదరుడైన రాజారాంకి (అతనిభార్య తారాబాయి నేతృత్వంలో) సంభాజీ కుమారుడైన శాహూకీమధ్య ఘర్షణ మొదలైంది. ఇప్పుడుకూడా ఉత్తరంనుండి దక్షిణంవరకూ దేశంలో రకరకాల సమస్యలు పెచ్చరిల్లుతూ ఉన్నవి. ఈ సమస్యలు బాగా చిక్కుముడులు పడిపోయినవైనందున, వాటిని పరిష్కరించడానికి చాలా సమయం పట్టుతుంది.
ఇది స్వాభావికమైన విషయం. ఇంటిలో మరమ్మతులు చేయటంలో భాగంగా ఒక పుచ్చిపోయిన లేదా విరిగిపోయిన దూలాన్ని తీసివేసి కొత్తది వేద్దామనుకొన్నపుడు, దానిని తీయటం మొదలుపెట్టగానే దానిదగ్గర పుచ్చిపోయినవి మరికొన్ని వెదురుబద్దలు కనిపించుతాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా పాడయిపోయిన వెదురుబద్దలు మార్చుతూ మొత్తం కప్పు మార్చివేయవలసి వస్తుంది. కార్యసాఫల్యం లభించటం ఆలస్యమవుతోందని నిరాశచెందకూడదు.
ఈనాడు పాకిస్తాన్లో హిందువులు యాతనల ననుభవిస్తున్నారు, దెబ్బలు తింటున్నారు. హిందూస్థాన్లోనూ దెబ్బలు తినవలసి వస్తున్నది. ఎవరో ఒక వ్యక్తి నిరాశ చెందటం మొదలు పెట్టితే హిందూ సమాజంలో జన్మనెత్తటమే ఒక పెద్ద దౌర్భాగ్యం అని చింతించుతూ ఉంటాడు. కాని ఇలా ఆలోచించటం సరైనదికాదు. ఎప్పటివరకైతే సమాజపు స్వాభావిక స్థితి పునర్నిర్మితం కాదో, అప్పటివరకు ఈ దుఃఖదాయక పరిస్థితులు మారవు. శివాజి సమయంలో సమాజంలో కొంత చైతన్యం వచ్చింది. సంభాజీ హత్య తరువాత రాజారామ్ ని రక్షించుకోటానికై అతడిని సుదూర దక్షిణాన ఉన్న జింజికోటలో ఉంచటం జరిగింది. ఔరంగజేబ్ సైనికులు తమ రాయగఢ్ కోటను చుట్టుముట్టి ఉండగా దానినుండి తప్పించుకొని రాజారామ్ తదితరులు బైటపడ్డారు.
సంతాజీ ఘోర్పడే, ధనాజీ జాధవ్ వంటి సేనానులు మహారాష్ట్ర ప్రాంతంలో గెరిల్లా యుద్ధం నడిపించుతూ ఉన్నారు. యావత్తు సమాజంవారికి తోడుగా నిలిచింది. అక్కడి చిన్న చిన్న గ్రామాలనుండి వారికి కావలసిన సైనికులు లభించారు. ఆహారపదార్థాలు అందుతూ వచ్చాయి. శత్రువుల కదలికలు, కార్యకలాపాలు సామాన్యవ్యక్తులు తెలిసికొనివచ్చి సేనాధిపతులకు తెలియజేస్తుండేవారు. ఫలాని గ్రామం నుండి మరాఠా సైనికులకు ఆహారపదార్ధాలు వెళ్ళినవనో, యువకులు వెళ్లి సైన్యంలో చేరినారనో, ఆయుధాలు తయారుచేసి ఇచ్చారనో, ఇంకేవిధమైన సహాయమో చేశారని ఔరంగజేబుకి తెలిసినపుడు పెద్ద సైన్యాన్ని పంపించి, ఆ గ్రామాన్ని ధ్వంసం చేయిస్తుండేవాడు. అక్కడి గ్రామవాసులందరినీ ఊచకోతకు గురిచేస్తుండేవాడు. ఇళ్లు నేలమట్టం చేయించేవాడు. పంటలను చేతికందకుండా నాశనం చేసేవాడు. ఇలా అనేకవిధాల అత్యాచారాలు, అణచివేత చర్యలూ తమపై జరుగుతున్నప్పటికీ, సాధారణ సమాజం మొగలులతో జరుగుతున్న ఆ యుద్ధంలో స్వరాజ్యానికి తమ సహకారం అందిస్తూనే ఉంది. ఇలాంటి స్థితి సమాజంలో అప్పుడప్పుడు కదాచిత్ గానే కనబడింది.
ఇలా కదాచిత్ గా కనబడే అగ్గిరవ్వల ప్రయోజనం ఏముంటుంది? సమాజ జాగరణ ద్వారా ఈ అగ్గిరవ్వలను స్థిరంగా మండుతున్న జ్వాలగా మార్చవలసి ఉంది. వేల సంవత్సరాల విదేశీ దాస్యపు కాలంలో మన శ్రేష్ఠపరంపరలు విచ్ఛిన్నమయ్యాయి, మన సమాజం పతనమైంది. ఈ విషయాలను గమనించుకోకుండా, కేవలం భవిష్యత్ ప్రణాళికలనే ఆలోచించటం సరైన పద్ధతి కాదు.